Mamata Banerjee: ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి అలానే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పీఠాన్ని మరో అయిదేళ్ల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసన మండలి ఏదో ఒక సభలో సభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీదీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయ్యింది. ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా ఖాళీగా ఉన్న భవానీపుర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేదా అన్న అనుమానమే. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
Read More: Mamata Banerjee: దీదీకి పదవీ గండం..? ఈసీ చేతిలో మమత భవితవ్యం..!!
ఈ నేపథ్యంలో తన పదవీ గండం నుండి దీదీ తప్పించుకోవాలంటే ఏకైక మార్గం శాసనమండలి ఏర్పాటే. దీంతో రాష్ట్రంలో మండలి ఏర్పాటునకు అసెంబ్లీలో దీదీ తీర్మానం ఆమోదించారు. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించినా టీఎంసీ బలంతో శాసనసభలో మండలి ఏర్పాటు తీర్మానం ఆమోదం పొందింది. దీదీ ఎమ్మెల్సీగా ఎన్నికై మరో అయిదేళ్లు ఎటువంటి ఢోకా లేకుండా సీఎంగా పరిపాలన సాగించాలని ఆమె ఆలోచన. కానీ ఇందులో ఒక చిక్కూ ఉంది. అసెంబ్లీలో ఆమోదించినంత మాత్రాన వెంటనే శాసనమండలి ఏర్పాటు అవ్వదు. దీనికి ప్రధాని మోడీ మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే బెంగాల్ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించాలి. అది ఇప్పట్లో సాధ్యం అవుతుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ల ప్రశ్న.
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే దీదీకి మరో సారి అధికారం దక్కకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్వశక్తులు వడ్డిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు పశ్చిమ బెంగాల్ పై పూర్తి ఫోకస్ పెట్టినా దీదీ నుండి అధికారాన్ని అడ్డుకోలేకపోయారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో దీదీని అయితే ఓడించగలిగారు గానీ రాష్ట్రంలో టీఎంసీ గెలుపును అడ్డుకోలేకపోయారు. అయితే దీదీ సీఎం పీఠంలో కూర్చున్నా బీజేపీ.. ఆమెను తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. ఈ తరుణంలో బెంగాల్ లో మండలి ఏర్పాటునకు కేంద్రం ఆమోద ముద్ర వేయడం కష్టతరమే అన్న మాట వినబడుతోంది.
2010లో అస్సోం అసెంబ్లీ, 2012లో రాజస్థాన్ అసెంబ్లీ లు సైతం తమ రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు చేయాలంటూ తీర్మానాలు ఆమోదించాయి. కానీ ఈ రెండు బిల్లులు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఏపికి సంబంధించి శాసనమండలి రద్దు అంశం సుమారు ఏడాది కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. పలు రాష్ట్రాల శాసనమండలికి సంబంధించిన అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన శాసనమండలిపై కేంద్రం వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపుతుందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఒక వేళ ఈ నాలుగు నెలల్లో బెంగాల్ శాసనమండలి పునరుద్ధరణ జరిగితే ఏదో మెరాకిల్ జరిగినట్లే లెక్క. ప్రస్తుతం బీజేపీ, టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నందున బెంగాల్ మండలి పునరుద్ధరణకు కేంద్రం అంత త్వరగా చర్యలు చేపట్టదు అనే మాటే వినబడుతోంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.