CM Stalin: ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో తన దైన మార్కుతో పరిపాలన సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహజ సిద్ధంగా తమిళనాడులో చాలా కాలం నుండి రాజకీయ పక్షాలు కక్ష సాధింపు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. అయితే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కీలక విషయాల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేస్తున్నారు. దీనితో స్టాలిన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు రావడం లేదు. తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రసంశలు అందుకుంటోంది. ఇక విషయంలోకి వెళితే….
CM Stalin: శివకాశి నుండే దేశ వ్యాప్తంగా దీపావళి టపాసులు
తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమల్లో బాణాసంచా తయారీ కూడా ఒకటి. శివకాశిలోని బాణా సంచా తయారీ పరిశ్రమ నుండే దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల బాణాసంచా ఉత్పత్తులు రవాణా, అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ పరిశ్రమ వేలాది మంది వ్యాపారులు, దాదాపు 8 లక్షల మందికిపైగా కార్మికులకు ఉపాధిగా ఉంది. బాణాసంచా క్రయ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగానే ఆదాయం వస్తుంది. శుభ, అశుభ కార్యాలు, దీపావళి వేడుకల్లో బాణా సంచా వినియోగం పెరుగుతున్నందున శివకాశిలో ఏడాది పొడవునా బాణాసంచా తయారీ కొనసాగుతూనే ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా విక్రయాలపై నిషేదం విధించాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే బాణాసంచా విక్రయాలపై నిషేదం విధించాయి. ఇలా రాష్ట్రాలు బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడిగా నిషేదాలు విధిస్తే.. బాణాసంచా పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు.
బాణా సంచా విక్రయాల నిషేదం సరికాదు
ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. బాణాసంచా విక్రయాలపై సామూహిక నిషేదం విధించడం మంచిది కాదనీ, దీని వల్ల ఆ పరిశ్రమపై ఆధారపడిన వేల కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. బాణాసంచా పై నిషేదం సరైన నిర్ణయం కాదనీ, ఇతర దేశాల్లో టపాసులపై నిషేదం లేదని పేర్కొన్నారు. వాయు కాలుష్యం నేపథ్యంలో టపాసుల విక్రయాలపై నిషేదం విధించినట్లు తెలుస్తోందనీ, కానీ సుప్రీం కోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణాసంచాలనే నిషేదించిందని అన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి తక్కువ కాలుష్యం వచ్చే గ్రీన్ క్రాకర్స్ నే ఇప్పుడు తయారు చేస్తున్నారని స్టాలిన్ లేఖలో వివరించారు. లక్షలాది మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని టపాసుల నిషేదంపై పునరాలోచన చేయాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. స్టాలిన్ లేఖపై ఆయా రాష్ట్రాల ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. బాణాసంచా పరిశ్రమ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిపోయి లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతిన కుండా ఉండేందుకు సీఎం స్టాలిన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి తమిళనాట ప్రజలు హాట్సాఫ్ చెబుతున్నారు.