హైదరాబాదు: గ్లోబరీన ఐసి సంస్థతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు అనుబంధం ఉందని తేలిపోయిందనీ, అందుకే పెద్దమ్మ తల్లి వద్ద ప్రమాణం చేయడానికి కెటిఆర్ రాలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి హనుమంతరావు అన్నారు.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీన ఐటి సంస్థతో కెటిఆర్కు సంబంధం లేకపోతే పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిపై ప్రమాణం చేయాలని వి హనుమంతరావు సవాల్ విసిరిన సంగతి విదితమే. మంగళవారం అమ్మవారి ఆలయానికి మంగళవారం వి హనుమంతరావు చేరుకున్నప్పటికీ కెటిఆర్ ప్రమాణం చేయడానికి రాలేదు.
దీంతో వి హనుమంతరావు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు. విద్యార్థులకు అన్యాయం చేసిన వారు ఎవరూ బాగుపడరనీ, రెండేళ్లలోపే ప్రభుత్వం కూలిపోతుందని వి హనుమంతరావు శాపనార్ధాలు పెట్టారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని అమ్మవారి దృష్టికి తీసుకువచ్చినట్లు వి హనుమంతరావు చెప్పారు.