భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శంకర్ దర్శకునిగా ఎంతో గౌరవం సంపాదించుకున్నాడు. వరస హిట్స్ తో శంకర్ నెం 1 డైరెక్టర్ అని అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
1993తో జెంటిల్ మ్యాన్ సినిమాతో శంకర్ సినీ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. నిర్మాత కెటి కుంజుమోన్ ఈ మేరకు ప్రకటన జారీ చేసారు. ఒకప్పుడు మేము అందించిన బ్లాక్ బస్టర్ జెంటిల్ మ్యాన్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ అందిస్తున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సీక్వెల్ లో పనిచేయనున్నారు అని తెలిపారు. అయితే ఈ సినిమాకు శంకర్ దర్శకుడా కాదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దానిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇకపొతే శంకర్ ప్రస్తుతం ఇండియన్ సీక్వెల్ ఇండియన్ 2 కోసం పనిచేస్తున్న విషయం తెల్సిందే. 1997లో విడుదలైన ఇండియన్ కూడా అప్పట్లో సెన్సేషన్. తెలుగులో భారతీయుడు పేరుతో ఈ సినిమా విడుదలైంది. 25 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది. కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన విషయం తెల్సిందే. దాంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ సాగలేదు. నవంబర్ నుండి ఇండియన్ 2 సీక్వెల్ మళ్ళీ పట్టాలెక్కే అవకాశాన్ని దర్శకుడు శంకర్ పరిశీలిస్తున్నాడు. జెంటిల్ మ్యాన్ 2, ఇండియన్ 2 కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.