AIIMS Chief: కరోనా థర్డ్ వేవే పిల్లలకు ఎక్కువ ప్రభావం చూపుతుందంటూ ఇటీవల మీడియా, సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందిస్తూ థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుంది అన్న దానికి శాస్త్రీయ అధ్యయనం లేదని అన్నారు. విశాఖ గీతం యూనివర్శిటీలో 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రవర్తన నియమావళిని పాటించడం పైనే మూడు వేవ్ ఆధాపడి ఉంటుందని వెల్లడించారు.
దేశంలో ఇప్పటి వరకూ పిల్లలకు వ్యాక్సినేషన్ జరగలేదు కాబట్టి ఎక్కువగా చిన్న వయస్సు గల వాళ్లు వైరస్ బారిన పడతారని అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రవర్తనా నియమావళిని ఏ మేరక పాటిస్తున్న అంశం పైనే వైరస్ వ్యాప్తి అధారపడి ఉంటుందని గులేరియా వెల్లడించారు.
ఏపిలో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే హఠాత్తుగా ఒక ప్రాంతం నుండి విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో కేసులు పెరగకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇదే నియమావళి దేశంతో పాటు ప్రపంచానికి కూడా వర్తిస్తుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ పై ఇప్పటి వరకూ ఉన్న వ్యాక్సిన్ లు బాగా పని చేస్తున్నాయని వెల్లడించిన గులేరియా వైరస్ కూడా వేరు విధాలుగా రూపాంతరం చెంది వ్యాక్సిన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందని తెలిపారు.