స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో ‘అల వైకుంఠపురం లో’ సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ ఇప్పుడు టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. దక్షిణాదిలో తనకున్న క్రేజీ ఫాలోయింగ్.. తర్వాత తన డబ్బింగ్ చిత్రాలకు బాలీవుడ్ వారు ఇస్తున్న అశేష ఆదరణ చూసి ఇకపై పాన్ ఇండియా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ‘పుష్ప’ కూడా అలాంటి సినిమానే కాగా దాని తర్వాత కూడా ఇలాగే అన్ని భాషల్లో తన చిత్రాలను వదిలేందుకు బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు.
అయితే ఇదే వరుసలో బన్నీ ‘ఐకాన్’ అనే ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాల్సి ఉండగా ఈ లోపలే ‘ఆనందో బ్రహ్మ’ మరియు ‘యాత్ర’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహి వి రాఘవ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. విశేషం ఏమిటంటే పాన్ ఇండియా సినిమా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కథను కేవలం ఒకే ఒక సిట్టింగ్ లో ఓకే చేశారు అల్లు అర్జున్. అంటే కథ ఆయనకు ఎంత బాగా నచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని మరియు ఇందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఓరకంగా ఈ చిత్రం ‘జగన్ బయోపిక్’ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే వైయస్సార్ బయోపిక్ ను ‘యాత్ర’ గా దర్శకత్వం వహించిన మహి ‘యాత్ర-2’ కూడా ఉంటుందని ఎప్పుడో చెప్పేశాడు.
అయితే ఈ సినిమాకు మరియు అల్లు అర్జున్ జగన్ బయోపిక్ కి ఎటువంటి సంబంధం లేదని ‘న్యూస్ ఆర్బిట్’ సన్నిహితులతో మహి చెప్పడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అంటే…. తండ్రి అకాల మరణం తర్వాత తన ప్రపంచంలో ఉన్న ఒక కుర్రాడు వచ్చి రాజకీయాలను ఎలా శాసిస్తాడు అని కథ ఉండబోతుంది అని తెలుస్తుండగా అది మామూలు కమర్షియల్ సినిమా లా ఉంటుందా అని లేకపోతే అఫీషియల్ గా ‘జగన్ బయోపిక్’ అని చెప్తారా లేదా అన్నది వేచిచూడాలి.