రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ.. తమకు అన్యాయం జరిగిందంటూ రోదిస్తూ.. పార్టీల మద్దతును కూడుగడుతూ.. రాజకీయ రంగు పులుము కుంటూ సాగిన ఆ ఉద్యమం విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. సామాజిక వర్గం ముద్ర, పార్టీల ముద్ర బలంగా ఉన్నప్పటికీ ఈ ఉద్యమం 200 రోజులు నడవడం మంచి గమ్మత్తైన విషయమే.
ఆరంభంలో బాగా కసిగా పాల్గొన్న రైతు కుటుంబాలు అన్నీ తర్వాత తర్వాత నిర్వీర్యం అయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టు విడువక పోవడం, ఇటు బిల్లు శాసనసభలో ఆమోదించడంతో చాలా కుటుంబాలు నిర్వీర్యం అయి ఉద్యమాన్ని నిరసింపజేశాయి. తర్వాత శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం, రెండవ దఫా కూడా బిల్లును తిరస్కరించడం ఇటు వంటి చర్యలతో మళ్ళీ ఉద్యమానికి ఊపు వచ్చింది. ఇలా చాలా సార్లు నిరసించి, చాలా సార్లు ఊపు వచ్చి అలా అనేక మలుపులు తీసుకున్న ఈ సామాజిక, రాజకీయ ఉద్యమం అనే సినిమా నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సినిమా ఆడుతుంది అనేది మాత్రం ఆసక్తికరమైన విషయమే. సామాజిక వర్గం.. రాజకీయం.. ఈ రెండు మాటలు లేకుండా ఈ ఉద్యమాన్ని వర్ణించడం చాలా కష్టం.
సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేయాలని ఎందుకు అంతగా పట్టుబడుతున్నారు? ఆ ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఎందుకు అంతగా పట్టుబడుతున్నారు? రెండిటికీ కారణం ఒకరే. రెండిటికీ సమాధానం ఒక్కరే. అదే చంద్రబాబు. అమరావతి అనేది చంద్రబాబు నెలకొల్పిన, చంద్రబాబు నిర్మించాలని తలపెట్టిన ఒక రాజధాని ప్రాంతం. ఇది ఉన్నంతకాలం రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అనే బ్రాండ్ ఉంటుంది అన్న ఒక్క తలంపుతో జగన్మోహన రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు బీజం వేశారు. ఇవి మంచి చెడో అనేది పక్కన పెడితే రాజధాని వికేంద్రీకరణ అనేది మాత్రం మంచి విషయమే. ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిచయం చేయకుండా మూడు నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి విస్తరించడం అనేది మంచి ఆలోచన. కానీ ఇక్కడ ఈ నిర్ణయం చుట్టూ ఉన్న రాజకీయాలే చెడు చేస్తున్నాయి. ఈ విషయంలో మనం మంచి, చెడు అనేది చెప్పలేం. ఆ విషయాన్ని పక్కన పెడితే.. రైతులు ఇన్ని రోజుల పాటు ఉద్యమించడానికి కారణం ఏమిటి? సామాజిక వర్గం, వారి వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు అనే ముద్ర కాకుండా ఇంకేమైనా మూడవ శక్తి పనిచేస్తుందా అంటే సమాధానం లేదు. నిజానికి అక్కడ భూములిచ్చిన 29 వేల రైతు కుటుంబాల్లో చాలా వరకు దిగువ స్థాయి సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా నడిపించేది మాత్రం ఒ ఉన్నత సామాజిక వర్గమే. అది అక్కడి రైతులకు తెలుసు..రాష్ట్ర ప్రజలకు తెలుసు.. రెండు పార్టీలకూ తెలుసు.. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రాజధాని వస్తుందని గంపెడాశతో భూములు ఇచ్చారు. రాజధాని రాదు.. అని తెలిసిన తర్వాత బాధ ఉంటుంది. ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనను, బాధను తెలియజేయడానికి మొదట ఉద్యమం రూపంలో మొదలైంది. దీనికి రాజకీయ రంగు అంటుకొని విపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకొని ఉద్యమానికి ఊపు తేవడం ద్వారా జగన్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి కూడా మరింత ముందుకు వెళ్లారు. రైతుల ఉద్యమం పోరాటంగా జరుగుతుండగానే ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నింటిని చాపకింద నీరులా చేస్తూ వచ్చారు.