భారత్ పొరుగు దేశం చైనా కుట్రలు, కుతంత్రాలు బయటపడ్డాయి. సరిహద్దులో కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో పేర్కొంది. గల్వాన్ ఘర్షణకు ముందు చైనా ఎలాంటి పథక రచన చేసిందో ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. చైనా కావాలనే రెచ్చగొడుతూ పొరుగు దేశాలతో ఘర్షణలు దిగుతోందని స్పష్టమైంది. అమెరికా నిఘా సంస్థల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదిక ద్వారా సంచలన అంశాలు బయటపడ్డాయి. చైనా పక్కా ప్రణాళికతోనే గల్వాన్లో ఘర్షణలకు దిగిందని, భారత సైనికుల ప్రాణాలు తీసే ఉద్దేశంతోనే ఆ దాడి జరిగిందని నివేదిక వెల్లడించింది.
అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్(యూఎస్సీసీ) తాజాగా అక్కడి కాంగ్రెస్కు ఓ నివేదిక సమర్పించింది. అందులో జూన్లో భారత్-చైనా మధ్య జరిగిన గల్వాన్లోయ ఘర్షణపై కీలక విషయాలు వెల్లడించింది. గల్వాన్ లోయలో చైనా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా దాడులకు పాల్పడినట్లు నివేదిక పేర్కొంది. నివేదికతో పాటు కీలక ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలిపారు. అమెరికా నిఘా సంస్థ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. గల్వాన్ లోయలో డ్రాగన్ కుట్ర ఇలా సాగింది..
జూన్ 15 ఘర్షణలకు కొన్ని వారాల ముందు చైనా రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా ప్రభుత్వ అధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో గల్వాన్ లోయపై భారత్ను హెచ్చరిస్తూ ఓ కథనం ప్రచురించింది. అమెరికా-చైనా శత్రుత్వంలో జోక్యం చేసుకుంటే భారత్కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని, చైనాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో హెచ్చరించింది. మరోవైపు గల్వాన్ ఘటనకు వారం రోజుల ముందు డ్రాగన్ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు ధ్రువీకరించాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (PLA) చెందిన దాదాపు 1000 మంది జవాన్లు గల్వాన్ లోయలో మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి. వీటన్నింటిని చూస్తే డ్రాగన్ ఓ పథకం ప్రకారం హింసకు పాల్పడినట్లు అర్థమవుతోంది’ అని యూఎస్సీసీ ఇచ్చిన నివేదిక లో పేర్కొంది. 2012లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్- చైనా మధ్య ఐదు సార్లు పెద్ద స్థాయిలో ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పిన అమెరికా. అయితే.. ఈ ఏడాది వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే కార్యకలాపాలు, ధోరణి వెనుక అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం కావట్లేదని అగ్రరాజ్యం తెలిపింది.
లద్ధాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో పరిస్థితి మరింత జటిలమైంది. ఆ సంఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా..చైనా వైపు ఇంతకు రెట్టింపు నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్నారు. అయితే.. తమ వైపు ఎంత మంది సైనికులు మరణించారనే అంశాన్ని చైనా ఇప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. ఈ ఘటన అనంతరం భారత్ చైనాకు తీవ్రమైన హెచ్చరికలు పంపింది. చైనా సంస్థలకు సంబంధించిన పలు యాప్లను నిషేధించి, కీలక ప్రాజెక్టులను రద్దు చేసి ఆర్థికంగా దెబ్బకొట్టింది. అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలోనూ భారత్ సఫలీకృతమైంది. మరోవైపు 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.