నెల్లూరు, ఏప్రిల్ 20 : టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్య జీవోలతో ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతున్నారని వైసిపి సీనియర్ నాయకుడు అనం రామనారాయణరెడ్డి విమర్శించారు. నెల్లూరు వైసిపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమీక్షలతో పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆనం అన్నారు. రహస్య జివోలను బయటపెట్టాలని గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు పాలనలో ఆస్తులు పెరగకపోయినా అప్పులు పెరిగాయని ఆనం విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలపై ఇసి పరిశీలన చేయాలని ఆనం కోరారు.
టిడిపి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందనీ, చంద్రబాబు విధానాల వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆనం విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అధికారులను ఇబ్బంది పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.