తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శీ లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయ రథం అగ్నికి ఆహుతి అవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆలయాన్ని మంత్రుల బృందం సందర్శించిన సమయంలోనే పెద్ద సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హింధూ ధర్మిక సంఘాల కార్యకర్తలు, నేతలు ఆలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారులను పోలీసులు అదుపుచేసే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి, జనసేన అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్లు “చలో అంతర్వేది”కి బుధవారం పిలుపునిచ్చారు.
అంతర్వేదిలో పోలీసు ఆంక్షలు
అంతర్వేదిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు విచారణకు ఆదేశించింది. మరో పక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు ఏలూరు రేంజ్ డీఐజి కెవి మోహనరావు వెల్లడించారు. ఇతరులు ఎవ్వరూ ఈ ప్రాంతానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న కొంత మంది శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారనీ అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి హెచ్చరించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
పోలీస్ పహారా మధ్య అంతర్వేది ఆలయం
బిజెపి, జనసేన చలో అంతర్వేది పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్వేది ఆలయ పరిసర ప్రాంతంలో, గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బిజెపి, జనసేన, విహెచ్పి కార్యకర్తలు, నాయకులు అంతర్వేది ఆలయానికి చేరకుండా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలపై బైండవర్ కేసులు నమోదు చేస్తున్నారు.
హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు డిమాండ్
అంతర్వేది ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనీ, హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని బిజెపి, జనసేన అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ లు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం పోలీసు దర్యాప్తునే కొనసాగిస్తున్నది. ఈ ఘటనను బిజెపి, జనసేన, హింధూ సంఘాలు తీవ్రంగా పరిగణనిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.