AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ బిశ్వభూషన్ అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి వేస్తూ గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ సభ్యుల నిరసనపై సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ప్రగతి, కరోనా కారణంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులు తదితర అంశాలను ప్రస్తావించారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి తొలి సారి విచ్చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇతర మంత్రులు స్వాగతం పలికారు.