AP Cabinet Meet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచౌంగ్ తుఫాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు ఏపీ కేబినెట్ అనుమతి ఇచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్ఎస్ఎల్ కు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటునకు మంత్రివర్గం ఆమోదించింది. నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది. విశాఖలోని నాలుగు కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృధాప్య పింఛన్లు రూ.3వేలకు పెంపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కాగా, మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే షేక్ సాబ్జీ మరణవార్త తెలియడంతో సీఎం జగన్ దిగ్భాంతి చెందారు. షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఎన్నికలకు పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని మంత్రులతో పేర్కొన్నారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యుల్ విడుదల కావచ్చని జగన్ అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దనీ, బలంగా తిప్పి కొట్టాలని మంత్రులను సూచించారు సీఎం జగన్.