టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదని సీఎం జగన్ సెటైర్ వేశారు. తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ .. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా నిధులు ఇస్తున్నామన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు మాటే లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా కరువే ఉండేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కరువు మండలం ప్రకటించే అవసరం రాలేదన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అంతా కరువు పరిస్థితులేనని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కశ్చితంగా కరువు వస్తుందన్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు మారారని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాజకీయ యుద్దం జరుగుతోందని అన్నారు జగన్. పేద వాడు ఒక వైపు, పెత్తందారులు మరో వైపు ఉన్నారని చెప్పారు. కుట్రలను, అన్యాయాలను గమనించాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నదాన్ని ప్రమాణికంగా చేసుకుని నిర్ణయం తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం.. రైతనన్న ప్రభుత్వం. రైతులను వంచించిన చంద్రబాబు ఒక వైపు,.. రైతులకు అండగా ఉంటున్న వైసీపీ ఇంకోవైపు ఉంది. కరువుతో స్నేహం ఉన్న చంద్రబాబు ఒక వైపు.. వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న మన ప్రభుత్వం ఇంకో వైపు ఉంది’ అని అన్నారు.

రాష్ట్రంలో గత దొంగల ముఖా ఉందనీ, ఆ ముఠా పని దోచుకో..పంచుకో.. తినుకో మాత్రమే. గత దొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు జతకలిశాడని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అప్పుడు డబ్బులు అన్ని ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో 175 కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ఉందా అని జగన్ సవాల్ విసిరారు. మీ బిడ్డకు భయం లేదు. నా దగ్గర ఈనాడు లేదు. ఆంధ్రజ్యోతి, టీవీ – 5 లేదు..దత్తపుత్రుడు లేడు అయినా సరే మేము చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ అన్నారు.