Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో Ap Politics ప్రస్తుతం సంచలనాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాల అమలుకు వెనకడుగు వేయడం లేదు. కరోనాపై సమీక్షలు చేస్తూ రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ నిల్వలు సమకూర్చడం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు, వ్యాక్సినేషన్ పై దృష్టి సారించారు. ప్రతిపక్షాలను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే.. గత ప్రభుత్వ పాలనలో తప్పులను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీ ఎంపీనే అరెస్టు జరిగింది. చట్టం పరిధిలోనే జరుగుతున్నా.. ప్రభుత్వ దూకుడును విపక్షాలు బలంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా సాధించిన మెజారిటీ ఓ చరిత్రే. 2014లో టీడీపీ-బీజీపీ-జనసేన కూటమి సాధించిన ఓటింగ్ కంటే 2019లో వైసీపీ సింగిల్ గా సాధించిందే ఎక్కువ. దీంతో ప్రజల తీర్పు ఏంటో రాజకీయాల్లో స్పష్టమైంది. అప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన విడిపోయి.. ఒంటరిగా పోటీ చేశాయి. పైగా.. బీజేపీపై అప్పటి టీడీపీ చేసిన వ్యాఖ్యలు, చూపించిన వ్యతిరేకత ఆ రెండు పార్టీల మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించింది. ఈ రెండింటి నడుమ ఉన్న జనసేన కూడా వీరి నుంచి విడిపోయింది. ప్రస్తుతానికి ఈ నాలుగు పార్టీలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ దూకుడు భవిష్యత్తులో మళ్లీ ఆ మూడు పార్టీలు పునరాలోచించుకునేలా చేస్తున్నాయని చెప్పాలి.
వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే 2024 ఎన్నికల్లో మళ్లీ జతకట్టి వైసీపీని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లే అవకాశాలు లేకపోలేదని చెప్పాలి. ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. ఇతర పార్టీల్లో నాయకత్వ లేమి ఉంది. కాబట్టి.. వాళ్ల బలాలేమిటో ఇటివలి పంచాయతీ, మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో విపక్షాలన్నీ ఏకమయ్యే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే జనసేనను టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు లేకపోలేదు. రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరనే నానుడి ఉండనే ఉంది. మరి.. వైసీపీ ఇటువైపు కూడా ఒక కన్నేస్తే మంచిదనే అభిప్రాయాలూ లేకపోలేదు.