Atal Pension scheme: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా భార్యభర్తలు ఇద్దరూ కలిసి నెలకు పది వేల వరకూ పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) తెలిపింది. ఈ పథకం ద్వారా భార్య, భర్త ఇద్దరూ నమోదు చేసుకుంటే గరిష్టంగా ఇద్దరు చెరో రూ.5వేల వంతున పొందవచ్చని పిఎఫ్ఆర్డీఏ ట్వీట్ చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకునే వారు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు మాత్రమే ఉండాలని తెలిపింది.
దేశంలో ఉన్న అసంఘటిత రంగంలోని వారు కూడా వృద్ధాప్యంలో గౌరవమైన జీవితం గడిపేందుకు వారికి పెన్షన్ ఉండేలా మోడీ సర్కార్ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరే వాళ్లకు బ్యాంకులో లేదా పోస్టు ఆఫీసులు సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ స్కీమ్ నుండి లబ్దిపొందేందుకు గానూ నెలకు రూ.42ల నుండి రూ.250 మధ్య చెల్లిస్తే రూ.1000 నుండి రూ.5వేల వరకూ పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ 60ఏళ్ల వయసు దాటిన తరువాత ప్రతి నెల తమ బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. ఈ పెన్షన్ పథకంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం ప్రీమియం లేదా ఏడాదికి వెయ్యి రూపాయలు ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వాలు అందేంచే ఏ సామాజిక భద్రతా స్కీమ్ పొందని, ఐ టీ పరిధిలోకి రాని వారికి మాత్రమే కేంద్రం ఆ సొమ్మును జమ చేస్తుంది.