ప్లాస్మా దానానికి సిద్ధమంటూ మోసాలకు పాల్పడుతున్న మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి చేతిలో ఏకంగా 200మందిపైగా మోసపోయినట్టు పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటపడింది.
కరోనా అల్లకల్లోలంలోనూ రోగుల నిస్సహాయతను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్న దారుణం ఇలా వెలుగుచూసింది. కరోనా వైరస్ కు మందు లేకపోవడం.. టీకా ఇప్పట్లో వచ్చే సూచనలు లేకపోవడంతో కరోనా ను జయించిన రోగుల ప్లాస్మాతో ఇప్పుడు క్రిటికల్ పొజిషల్ లో ఉన్న రోగులు కోలుకుంటున్నారు. ప్లాస్మా దివ్యౌషధంలా పనిచేస్తోంది .దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు ప్లాస్మా దానం ఇస్తామంటూ కరోనా రోగులను మోసగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనుగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ (25) అదే పని చేసి దొరికిపోయాడు
అతడు 2016లో డిగ్రీ పూర్తి ఉద్యోగం దొరక్క ఖర్చులకు డబ్బుల్లేక దొంగగా మారాడు. జైలుకువెళ్లి వచ్చిన ఇతడు ఈ కరోనా వేళ కోలుకున్న వారి ప్లాస్మాకు భారీ డిమాండ్ వచ్చిందని తెలుసుకొని సరికొత్త మోసాలకు తెరతీశాడు. ప్లాస్మా అవసరం అని సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆ నంబర్లు తీసుకొని సేకరించాడు.వారికి ఫోన్ చేస్తూ తాను ప్లాస్మా ఇస్తానని.. రవాణా ఖర్చులు.. ఇతర ఖర్చులు మీరే భరించాలని చెప్పేవాడు. వారు ఆన్ లైన్లో మనీ ట్రాన్స్ ఫర్ చేయగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసేవాడు. కరోనా నియంత్రణ మందుల పేరిట మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సందీప్ ను కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇతడి చేతిలో చాలా మంది మోసపోయినట్టు తెలిసింది. కాదేదీ మోసానికనర్హం అన్నట్లు పరిస్థితి తయారైంది.