Nimmagadda Ramesh Kumar : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ జిల్లాలన్నీ తిరిగి అధికారులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేశారని తప్పుబట్టారు. ఏకగ్రీవాలు చట్ట విరుద్ధమని ఏ చట్టంలో ఉందని మంత్రి ప్రశ్నించారు. ఓటు నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎస్ఈసీగా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవాచేశారు.అంతకుముందు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్లో ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మ గడ్డపై పై ఫైర్ అయ్యారు.పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కూడా ఈ జాబితాలో ఉండటం ఆయన ఆగ్రహానికి కారణమైంది .ఒక హిడన్ అజెండాతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న నిమ్మగడ్డ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు .ఇదే సమయంలో ఆయన ఇంతకు ఇంత అనుభవిస్తారని కూడా మంత్రి శాపనార్థాలు పెట్టారు.
Nimmagadda Ramesh Kumar : గొంతు కలిపిన రోజా!
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డపై వైసీపీ ముఖ్య నాయకురాలు ,నగరి ఎమ్మెల్యే ఎపిఐఐసి చైర్మన్ రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిమ్మగడ్డకు చిన్నమెదడు చితికిపోయిందేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను పక్కనబెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనను మెచ్చి పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఎడమొఖం పెడమొఖంగా ఉండే పెద్దిరెడ్డి రోజాలు నిమ్మగడ్డ విషయంలో ఒకే టైపు వాయిస్ వినిపించటం కొసమెరుపు.