తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తన నేతలు వలసలు కడుతున్నారు. అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కారు పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇతర పార్టీలకు చెందిన వారిని బెదిరించో, బతిమిలాడో కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు ఇతర పార్టీలతో పాటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు బతికి బట్టకట్టనీయకుండా చేసేశారు కేసీఆర్. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి కూడా ఓడిపోయింది.
వాస్తవంగా చూస్తే గ్రౌండ్లో బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంది. అయినా కూడా ఆ పార్టీని నమ్మని చాలా మంది నేతలు కాంగ్రెస్లోకి వలసలు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సొంతగూటికి చేరడంతో హ్యాపీగా ఉన్నానని.. గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసినట్టు చెప్పారు.
ఇక చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి. వీరికి ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి. వీరి స్వస్థలం నల్లగొండ జిల్లాలోని నాగార్జునా సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం. ఆయన 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత మంచిరెడ్డి గులాబీ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్లో చంద్రశేఖర్ రెడ్డి పూర్తి డమ్మీగా మారిపోయారు. అసలు నియోజకవర్గంలో ఆయన అనుచరగణం అనేదే లేకుండా చేయడంతో పాటు చంద్రశేఖర్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా తొక్కేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునా సాగర్ నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు ఎక్కడా సీటు ఇవ్వలేదు.
ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు పార్టీలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని చెపుతున్నారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే కాదు.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరారు. జవహర్ నగర్ మేయర్ కూడా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.