మనం షాపింగ్ కి వెళ్లి ఏం కొనుగోలు చేసినా.. క్యారీ బ్యాగ్ ఉచితం గా అందిస్తాయి కంపెనీలు. కానీ ఇప్పుడు అది కాస్త మారి, కంపెనీలు తమ కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు ముద్రించిన క్యారీబ్యాగ్లు కూడా మనకు రూ.2, రూ.3, రూ.5 కి అమ్మేస్తున్నాయి. ఇదే విషయాన్ని అడిగితే మాత్రం కంపెనీ సిబ్బంది వినియోగదారులనే టార్గెట్ చేస్తారు.
అలా కస్టమర్ ని టార్గెట్ చేసినందుకు ప్రముఖ చెప్పుల దుకాణం సంస్థ బాటాకు చేదు అనుభవం ఎదురైంది. క్యారీ బ్యాగ్కి అదనంగా డబ్బు తీసుకున్నందుకు భారీ జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. అయితే ఇలా ఎప్పుడైనా జరిగినప్పుడు వినియోగదారులు ఈ విషయం లో న్యాయపోరాటం చేస్తే మాత్రం న్యాయం దక్కుతుందని ఓ వినియోగదారుని గాథ నిరూపించింది.
వేలాది రూపాయలతో వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారుడిని పలు సంస్థలు ప్లాస్టిక్ కవర్ల పేరుతో భారీగానే దోచుకుంటున్నాయి. ఈ ప్లాస్టిక్ కవర్లపై రోజుకు రూ.5-6 లక్షల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం లేదు. ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలవుతున్నా లెక్క చేయకుండా పలు వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ వినియోగదారుడి జేబునుండి డబ్బు తీస్తున్నాయి. సామగ్రిని కొనుగోలు చేసిన వారికి కవర్లను ఉచితంగా అందించాల్సింది పోయి రూ.3-14 చొప్పున వసూలు చేస్తున్నాయి.
అలా వసూలు చేయడం తప్పేమి కాదు కానీ అలా వసూలు చేసి ఇచ్చిన కవర్ మీద ఆయా సంస్థల లోగోను ముద్రించిన కవర్లను అందిస్తూ వినియోగదారుడిని పబ్లిసిటీకి వాడుకోవడం మాత్రం తప్పే . అయితే కవర్లను తక్కువ ధర కు కొనడం తో చాలామంది వీటినిపట్టించుకోవడం లేదు. కానీ చండీగఢ్ లో ఒక వినియోగదారుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తం గా ఆలోచించేలా చేసింది. వ్యాపార సంస్థల దోపిడీని సవాలు గా తీసుకుని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, ఫోరం ఆ వ్యాపార సంస్థకు రూ.9 వేల జరిమానాతో పాటు కవర్లపై లోగో ముద్రించడాన్ని నిషేధించింది.
ఎవరైనా వారి కంపెనీ లోగో ముద్రించిన క్యారీ బ్యాగ్కి డబ్బులు వసూలు చేస్తే కస్టమర్లు ఫోరం కు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు..