BRS MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెను ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేదుకు కూడా డిల్లీ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23వ తేదీ వరకూ ఈడీ కవితను విచారించనుంది.
ఈ క్రమంలోనే కవితకు మరో షాక్ ఇచ్చేలా ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అలానే కవిత పీఆర్ఓ రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ లకు కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హజరు కావాలని ఈడీ ఆదేశించింది. కవిత నివాసంలో నిన్న సోదాల చేస్తున్న సమయంలో అయిదు సెల్ ఫోన్ లు ఈడీ అధికారులు సీజ్ చేశారు.
ఇవేళ కవితను సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపర్చిన సమయంలో అరెస్టు అక్రమమని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినా కోర్టు తిరస్కరించింది. ఈడీ తరపు వాదనలకు ఏకీభవించి కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. కాగా, కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని పేర్కొంది. సౌత్ గ్రూప్ పేరుతో కవిత స్కామ్ లో కీలకంగా ఉన్నారని ఈడీ పేర్కొంది.
ఈ కుంభకోణంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్దిదారు కవితేనని, ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కామ్ ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారని చెప్పింది. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది. పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారాన్ని నడిపించారని అభియోగించింది. కేసు నుండి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలను తొలగించారన్నారు. ఇంకా అనేక విషయాలను రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
BRS MLC Kavita: కోర్టులో కవితకు లభించని ఊరట .. ఈ నెల 23వరకూ ఈడీ కస్టడీకి అనుమతి