పొగత్రాగడం హానికరం అని తెలిసినా, సిగరెట్ తాగడం వల్ల ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని తెలిసినా అవేమీ పట్టించుకోకుండా సిగరెట్లను అలా ఊది పారేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా పొగాకును నిషేధించలేకపోతున్న ప్రభుత్వం ఇంక దీని ధరను పెంచితే కొనేవారు తక్కువ అవుతారనే అభిప్రాయంలో ఉంది. కానీ ప్రభుత్వం ధరను ఎంత పెంచినా కొనేవాళ్ళు మాత్రం తగ్గట్లేదు. ఇవేమీ వర్కౌట్ కావడం లేదని గ్రహించిన జార్ఖండ్ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. యువతలో పొగతాగేవారి సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో సిగరెట్కు ప్రభుత్వ ఉద్యోగానికి ముడిపెట్టింది.
ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారు ధూమపానానికి దూరంగా ఉండాలంటూ కొత్త నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. అలాగే పొగతాగడం లేదని ఒక అఫిడవిట్ కూడా సమర్పించాలని సూచించింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి తీసుకొస్తామని జార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలి.