2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంతో టీడీపీ చరిత్ర ఇక కథం అన్న భావన వచ్చిందన్నా అతిశయోక్తి కాదేమో! ఆ రేంజ్ లో టీడీపీ కేడర్ తో పాటు అధినాయకత్వం కూడా సైలంట్ అయిపోయింది. సరే అయ్యిందేదో అయ్యింది.. ఆ ఘోర పరాభవానికి కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలియడంతో నాయకులంతా సైలంట్ గా ఉండిపోయారు. అయినా కానీ తాజాగా బాబుకు కొంత ఉపశమనం కలిగించిన విషయం ఒకటి ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఆ దెబ్బ నుంచి తేరుకుని మహానాడు పేరుచెప్పి అయినా కేడర్ లో కాస్త ఉత్సాహం తీసుకొద్దామనుకుంటే.. ఒక పక్క కరోనా, అనంతరం అచ్చెనా అరెస్టు.. సీబీఐ ఎంక్వైరీలు, ఏసీబీ అరెస్టులు.. ఈ దెబ్బలకు అధినేతకు గూబలూ వాసిపోయాయనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఏ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై వస్తున్న సమాచారం విషయంలో బాబుకు కొంత ఆనందాన్ని కలిగిస్తుందంట కృష్ణాజిల్లా!
అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో కాస్త హడావిడి చేసే అవకాశం కలగడంతో ఆ ప్రాంతంలో టీడీపీకి కాస్త ఆశలు చిగురిస్తున్న దశ ఇది! ఇదే సమయంలో పెనమలూరులో బోడే ప్రసాద్, తిరువూరులో మాజీ మంత్రి జవహర్, మైలవరంలో దేవినేని ఉమా, విజయవాడ తూర్పు నుంచి రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ సిటీలో ఎంపీ కేశినేని వంటి నేతలు ఫుల్ ఉత్సాహంతోనే పనిచేస్తున్నారని తెలుస్తోందంట.
ఇక మిగిలిన అవనిగడ్డ, జగ్గయ్యపేట, గన్నవరం వంటి ప్రాంతాల్లో నాయకుల్లో కాస్త ఉత్సాహం తగ్గినా.. కేడర్ పరంగా పాజిటివ్ పవనాలే వీస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా బాబుకు గుడ్ న్యూస్ ఏమైనా ఉందంటే.. అది కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితే అని అంటున్నారు విశ్లేషకులు.