Karimnagar: కరీంనగర్ లోని ప్రముఖ హోటల్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు సోదాలు చేశారు. భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల షెడ్యుల్ విడుదల కాకముందే భారీ మొత్తంలో నగదు పట్టుబడటం గమనార్హం. ఇవేళ సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి కోడ్ అమలులోకి వస్తుంది. నగదు తరలింపుపై ఆంక్షలు ఉంటాయి. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. రూ.50వేలకు మించి నగదు తరలిస్తే అధికారులు సీజ్ చేస్తారు. అందుకే రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ముందుగానే పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని సమకూర్చుకోవడం జరుగుతుంటోంది. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఓ రాజకీయ పార్టీ నేత పెద్ద మొత్తంలో నగదును తీసుకువెళుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్ థియేటర్ లో తనిఖీలు చేపట్టారు.
పోలీసుల సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. ఆ డబ్బును సీజ్ చేశారు. రూ.6 కోట్ల 65 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేవని చెప్పారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. ప్రతిమ మల్టీ ప్లెక్స్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వినోద్ బంధువులదని సమాచారం. పోలీసుల తనిఖీలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం కరీంనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది.
BJP: ప్రధాని మోడీకి ఏపీ బీజేపీ అసంతృప్త నేతలు లేఖ .. ఎందుకంటే..?