గత కొంతకాలంగా బాలీవుడ్.. టాలీవుడ్..కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో బయోపిక్స్ బాగా వెండితెరమీదకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. బాలీవుడ్ లో దంగల్.. టాలీవుడ్ లో మహానటి సావిత్రి జీవిత కథ గా వచ్చిన మహానటి .. అలాగే సీనియర్ ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు.. ఎన్.టి.ఆర్ మహానాయకుడు అలాగే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది జీవిత కథలు వెండితెర మీదకి వస్తున్నాయి. అంతేకాదు మరికొంతమంది బయోపిక్స్ కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
కపిల్ దేవ్ బయోపిక్ 83 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాని నాగార్జున రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే సైనా నెహ్వ ల్ బయోపిక్ కూడా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో పరిణితి చోప్రా టైటిల్ రోల్ లో కనిపించబోతోంది. ఇక రీసెంట్ గా సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ భారీ విజయాన్ని అందుకుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా తో సూర్య కి చాలా కాలం తర్వాత మంచి హిట్ దక్కింది.
కాగా మరో బయోపిక్ వెండితెర మీదకి రాబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్ లో నటించబోతున్నాడట. కాగా ఆ బయోపిక్ ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ది అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథతో రెండు సినిమాలు తెరకెక్కుతుండగా ఒక సినిమాలో నిత్యా మీనన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా మరొక సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టైటిల్ రోల్ లో కనిపించబోతోంది.