గీత గోవిందం లాంటి డీసెంట్ హిట్ తర్వాత పరశురాం సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా తెరకెక్కించబోతున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండగా…రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేటయింది.
ఇక ఈ సినిమా కోసం అమెరికాలో 45 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. కాని ప్రస్తుతం అక్కడ కరోనా సెకండ్ వేవ్ విస్తృతమవుతున్న కారణంగా డిసెంబర్ నుంచి లేదా జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తూ అమెరికా లో చేయాల్సిన సీన్స్ ని తగ్గిస్తున్నట్టు సమాచారం.
అయితే లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే 2021 జనవరి నుంచి సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారట. అమెరికా షెడ్యూల్ గనక డిలే అయితే ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఇప్పటికే ఈ బ్యాంక్ సెట్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సెట్ లో ఇంటర్వెల్ సమయంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. సినిమాకే ఈ సీన్స్ ఎంతో హైలెట్ గా నిలుస్తాయని ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రాం – లక్ష్మణ్ ఆధ్వరయంలో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కబోతున్నాయట. ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుందని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించబోతున్నాడట దర్శకుడు పరశురాం.