KA Paul: రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఇఓ) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కోపం వచ్చింది. కొద్ది సేపు ఏపీ సచివాలయం వద్ద హడావుడి సృష్టించారు. సచివాలయం వద్ద ఆయన నిరసనకు దిగారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనకు అహ్వానించకపోవడంపై ఆయన నిరసన తెలియజేశారు. తొలుత ఆయనను సచివాలయ ప్రధాన ద్వారం వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
భద్రతా సిబ్బందితో కేఏ పాల్ వాగ్వివాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని, ఇప్పుడు కలవడానికి వీలులేదని సిబ్బంది కేఏ పాల్ కు తెలిపారు. దీంతో ఆయన అయిదో బ్లాక్ మెట్ల వద్దే కూర్చుని కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు అహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. సీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడానికి వీల్లేదంటూ భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తరలించారు.
కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అపాయిట్మెంట్ లేకపోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో హడావుడి చేయడం మామూలే. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు గతంలోనే కేఏ పాల్ ప్రకటించారు.
TDP Janasena: ఢిల్లీ నుండి చంద్రబాబు, పవన్ లకు పిలుపు .. బీజేపీ నేతలతో కీలక భేటీ