YS Sharmila : సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఫ్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యింది.
సందర్భమేమీలేనప్పటికీ ఆయన మొన్న జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ లో కొత్త పార్టీలకు ఇక అవకాశం ఏమాత్రం లేదనడమే కాకుండా పార్టీ పెట్టడమంటే పాటలు పాడుకోవడం … పాన్ షాప్ పెట్టడం కాదని పంచ్ డైలాగ్ లు విసిరారు.
YS Sharmila :సమయం సందర్భం ఉండాలి?
అసలు పార్టీ పెట్టాలంటే ఏదైనా సందర్భం ఉండాలని, అలాంటి అవసరం కూడా ఉండాలని ఆయన చెప్పారు. పార్టీ పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని బలమైన సంస్థాగత నిర్మాణం ఉండాలన్నారు.పార్టీని ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు,నేర్పరితనం, బలమైన నాయకత్వం పార్టీ పెట్టేవారికి ఉండాలన్నారు.
14 కొత్త పార్టీలు వచ్చిపోయాయి
తెలంగాణలో గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. దేవేందర్గౌడ్, నరేంద్ర, విజయశాంతి, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా.. వాటి ఆనవాళ్లు లేవన్నారు. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా.. ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. దారితప్పిన వారి పరిస్థితి అదే అవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.టీఆర్ఎస్ చిరకాలం ఉంటుందన్న కేసీఆర్.. కొత్త పార్టీలకు అవకాశం లేదన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికే టీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని ముద్దాడమన్న గులాబీ బాస్.. పార్టీకి బలమైన పునాది ఉందన్నారు. పార్టీ అంటే పాటలు పాడటం.. పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవి షర్మిలని ఉద్దేశించి చేసిని వని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమె మాత్రమే సన్నాహాలు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఆమె పార్టీపై ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు అంటున్నారు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కెసిఆర్ కి సత్సంబంధాలు ఉండటం కూడా ఇక్కడ గమనార్హం.