ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనంత తానుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కీలకమైన విషయంలో ఆయన వ్యవహరించిన తీరుతో అధికార వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా సీబీఐ విచారణ గురించి.
చంద్రబాబు ఏమన్నారంటే….
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ వైసిపి ప్రభుత్వ వేధింపులకు మరో ముస్లిం మైనారిటి కుటుంబం బలైంది. నంద్యాలలో రైలు పట్టాలపై అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు హృదయ విదారకం. ష్ట్రంలో వైసిపి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట. నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు. ఎవరినీ స్వేచ్ఛగా బతకనిచ్చేలా లేరు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలి. ఈ దుర్ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. “ అని కీలక డిమాండ్లు చేశారు.
వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారంటే…
ముస్లిం కుటుంబం బలవన్మరణం విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఘటన తీవ్ర బాధాకరమని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో తగు చర్యలు చేపట్టిందని పేర్కొంటున్నాయి. సమగ్ర విచారణ, బాధ్యులను అదుపులోకి తీసుకోవడం, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం వంటివి చేసినట్లు పేర్కొంటున్నారు. గతంలో సీబీఐ రాకనే ఏపీలోకి నిషేధించిన వ్యక్తి ఇప్పుడు అదే సీబీఐ పేరును ప్రస్తావించడం అందులోనూ ఇంత విచారణ జరిగిన తర్వాత కోరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.