MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు హోరాహోరీ జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నందు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మోహన్ బాబు మా ఎన్నికల నిర్వహణ, మంచు విష్ణు విజయం తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైయ్యాయన్నారు. మా ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమనీ మా లో తామంతా ఒకే తల్లి బిడ్డలమని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కళాకారులకు అన్యాయం జరగకూడదన్నారు. కళాకారుల కోసం తాను ఏమి చేశానో పకృతికి, ఆ భగవంతుడికి తెలుసునన్నారు. గతంలో చిత్రపురి కాలనీని హెరిటేజ్ సైట్ కింద మార్చేసి చుట్టూ ఉన్న కొండలను ఏదో చేద్దామని ఓ ముఖ్యమంత్రి ప్లాన్ చేశారనీ, ఈ విషయం నాడు తమ్ముడు (మంత్రి) తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా తెలుసునన్నారు. ఆ సమయంలో తాను రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాననీ, ఆ సమస్యపై అప్పట్లో గవర్నర్ వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు.
MAA: మా అనేది రాజకీయ వేదిక కాదు.
మా అనేది రాజకీయ వేదిక కాదు. కలిసి మెలసి ఉంటూ కావల్సినవి సాధించుకుందామన్నారు. విష్ణును భగవంతుడు ఆశీర్వదించాడన్నారు. ప్రస్తుతం కళామతల్లి బిడ్డల్లో ఐక్యం లోపించిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణు గెలుపునకు నరేష్ అందించిన సాయాన్ని ప్రశంసించారు. నరేష్ అందించిన సాయం మామూలు సాయం కాదన్నారు. గెలుపు కోసం చాలా కృషి చేశాడని చెప్పారు. విష్ణుకు ఎన్నో సలహాలు అందించాడన్నారు. వాస్తవానికి తానకు నరేష్ స్నేహితుడు కాదనీ ఆయన తల్లి విజయనిర్మల తీసిన సినిమాల్లో తను చేసినట్లు మోహన్ బాబు తెలిపారు. నరేష్ తో మాత్రం తను ఎప్పుడూ సన్నిహితంగా లేకపోయినా నేడు తన కుమారుడు విష్ణు సాయం చేశాడని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఏపి ప్రభుత్వాన్ని కలవాలి
ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే ప్రత్యర్ధులపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. సినీ వర్గాల్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో విష్ణుకు పలు జాగ్రత్తలు చెప్పారు. ఓట్లు వేసిన వారికి, వేయని వారికి అందరినీ సమానంగా చూసి సేవలు అందించాలన్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి మా ఉన్నతికి పాటుపడాలన్నారు. సమస్యల పరిష్కారానికి అటు ఏపి ప్రభుత్వం వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలని సూచించారు.