కరోనా తీవ్రతకు సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ లేక కార్మికులు, సినిమా రిలీజ్ ఆగిపోయి నిర్మాతలు ఇబ్బందుల్లో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలీని పరిస్థితి. ఈనేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ నష్ట నివారణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమిళ సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నటీనటుల పారితోషికాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరో హీరోయిన్ల నుంచి చిన్న నటుల వరకూ వారి రెమ్యునరేషన్లలో 20 శాతం నుంచి 50 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. టెక్నీషియన్లు, ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో కూడా ఈ నిబంధన వర్తింపజేయాలని జూలై 7న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై మరింత చర్చించి కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తామని ప్రముఖ నిర్మాత ఎస్ ఆర్ ప్రభు అంటున్నారు. నిర్మాతల శ్రేయస్సే ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు.
ఇప్పటికే ఈ నిర్ణయంపై తమిళ వర్గాల్లో సానుకూల స్పందన వస్తోంది. దర్శకులు అజయ్ జ్ఞానముత్తు, హరి, విజయ్ ఆంటోనీ.. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. మరి దీనిపై తెలుగు సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. ఇక్కడ కూడా ఇటువంటి చర్చ వస్తుందా లేదా అనేది చూడాలి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!