నాటి ప్రధాన కార్యదర్శి ఎల్వీని తప్పించడంలో ఆయనే కీలకం…!
నేటి అజయ్ కల్లంని తప్పించడంలో ఆయనే కీలకం…!
సాటి ఐఏఎస్ లకు బదిలీ కావాలంటే ఆయనే కీలకం…!
ఆ ఐఏఎస్ అంటే ఏంటి అంత ప్రాధాన్యత..? ఆ ఐఏఎస్ అంటే జగన్ కి ఎందుకు అంత ఇష్టం..?? కులమా..? ప్రాంతమా..? మతమా..? ఇవేమి ఏమి కాదు. నిజానికి జగన్ కి, ఆయనకీ అంతకు ముందు అసలు సంబంధమే లేదు. కానీ అధికారం వచ్చిన తర్వాత జగన్ బలహీనత ఈయన బలంగా మార్చుకుని చక్రం తిప్పే స్థాయికి వెళ్లారు.
హోదాకి మించి ప్రాధాన్యత…!
ఆ ఐఏఎస్ ఎవరు అనేది అర్ధమయ్యే ఉంటుంది..! ప్రవీణ్ ప్రకాష్. ప్రస్తుతం జగన్ వద్ద అత్యంత కీలక అధికారి. సిఎస్ నీలం సాహ్ని ఆ పదవిలో ఉండాలంటే ఈయన ఆశీస్సులు ఉండాలి. ఎవరైనా కార్యదర్శికి ఆ హోదా ఉండాలంటే ఈయన అండదండలు ఉండాలి. నాడు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ని తప్పించడానికి ప్రవీణ్ ప్రకాష్ జీవో ఇచ్చారు. అప్పుడే కొన్ని అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఒక సీఎస్ ని తప్పించడానికి, సీఎం ప్రత్యేక కార్యదర్శి(రాజకీయ) ఉత్తర్వులు ఇస్తారా..? అనే అనుమానాలు రేకెత్తాయి. ఇవి తీరలేదు. నాడు ఎల్వీ కోర్టుకి వెళ్తే వాదనలు జరిగి.., చివరకు ఏమయ్యేదో. కానీ అనవసర వివాదాలు ఎందుకు అనుకుని ఎల్వీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. అలా ప్రవీణ్ పెత్తనం మొదలయింది, ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది.
అజయ్ కల్లంని తప్పించడంలోనూ…!
ఇక ఇప్పుడు తాజాగా అజయ్ కల్లం రెడ్డిని తప్పించి ఆ బాధ్యతలు ప్రవీణ్ ప్రకాష్ కి బదిలీ అయ్యాయి. అజయ్ కల్లం రెడ్డి మంచి పేరున్న అధికారి. చురుకు. మంచి సబ్జెక్టు ఉంది. జగన్ కి వాలంటీర్లు, గ్రామా సచివాలయాలు వంటి ఐడియాలు ఇచ్చింది ఆయనే. అప్పుడప్పుడూ రాజకీయంగానూ పెద్దలకు సమాధానాలు ఇస్తుంటారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విద్యుత్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే… అజయ్ కల్లం కల్పించుకుని సరైన సమాధానం ఇచ్చారు. కానీ అంతటి కీలకమైన అధికారి జగన్ కి కానీ వాడు అయిపోయారు. ఉన్నట్టుండి అధికారాలను కత్తిరించేసారు. ఆ అధికారాలన్నీ ప్రవీణ్ ప్రకాష్ కి బదిలీ అయిపోయాయి. ఇక పరిపాలనలో కర్త, కర్మ, క్రియ సమస్తమూ ప్రవీణ్ ప్రకాష్ మాత్రమే. ధనుంజయరెడ్డిని కాదని జగన్ ఈయనకి పెత్తనాలు అప్పగించారు.
(ఇక ప్రవీణ్ ప్రకాష్ ఎక్కడి నుండి వచ్చారు. ఈయన నేపథ్యం, అవినీతి ఆరోపణలు., జగన్ కి ఎలా దగ్గరయ్యారు అనేది తర్వాత కథనంలో చెప్పుకుందాం..)