YCP MLA Nallapareddy: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందించారంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచార సందర్భంలో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా వైఎస్ జగన్..కులాలు చూడం, మతాలు చూడం..పార్టీలు చూడం..అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటూ వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ మాటలను విశ్వసించారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలో పరిపాలన మారినా విధానాలు మారడం లేదు. నాడు వారు (టీడీపీ ప్రభుత్వం) చేసిందే నేడు (వైసీపీ ప్రభుత్వం) వీరు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికే సంక్షేమ పథకాలు అందాలి, అందుతున్నాయి అనడానికి ఇది ఓ ఉదాహారణ. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారులకు రహస్యంగా చెప్పి పనులు కానిస్తుండగా కొందరు ఎమ్మెల్యేలు అయితే బాహాటంగానే అధికారులకు ఏకపక్షంగా పని చేయాలంటూ హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాటలకు భిన్నంగా నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేరే పార్టీ వారికి అసలు పనులు చేయడానికి వీలులేదంటూ అధికారులకు హుకుం జారీ చేయడం విశేషం. ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమన్నారంటే.. అధికారులకు ఇప్పుడే చెబుతున్నా..టీడీపీ సర్పంచ్ కి గానీ, ఇంకెవరైనా నాయకులకు గానీ ఎలాంటి పనులు చేయడానికి వీలులేదు, పల్లెపాడు సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలైన స్థానిక వైసీపీ నేత కుమార్ రెడ్డి చెప్పిందే అధికారులు చేయాలి. గ్రామాల్లో గానీ మండలంలో గానీ అధికారులు వేరే పార్టీ వారికి పనులు చేసినట్లు తెలిస్తే వారిపై చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాదు. ఇంతకు ముందు జిల్లా ఎస్పీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జగనన్న ఇళ్లు సోభనానికి కూడా పనికి రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారూ జగన్ స్వామ్యం కాదిది. ప్రజాస్వామ్యం. టీడీపీకి ఓటేస్తే, టీడీపీ ప్రజా ప్రతినిధులు గెలిస్తే..అక్కడ అధికారులు పని చేయొద్దా ? నియోజకవర్గం నీ తాత జాగీరా? అధికారమదం దిగే రోజు తొందర్లోనే వస్తుంది. అప్పుడు తెలుస్తుంది.. ఎన్నుకునే ప్రజల విలువ – ప్రజాస్వామ్యం విలువ” అంటూ లోకేష్ విమర్శించారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గారూ జగన్స్వామ్యం కాదిది. ప్రజాస్వామ్యం. టిడిపికి ఓట్లేస్తే, టిడిపి ప్రజాప్రతినిధులు గెలిస్తే..అక్కడ అధికారులు పనిచేయొద్దా? నియోజకవర్గం నీ తాత జాగీరా? అధికారమదం దిగే రోజు తొందర్లోనే వస్తుంది. (1/2) pic.twitter.com/5MCFrgvCdN
— Lokesh Nara (@naralokesh) August 7, 2021