విశాఖ లో ఆదివారం కాస్తా హాట్ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు ఇటీవల కూల్చివేతకు దిగడంతో మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.
విజయసాయి ట్వీట్ తో మొదలైన వివాదం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో రామకృష్ణబాబు భూకబ్జా వ్యవహారంపై ట్వీట్ చేశారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు వేల కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా దోచేశారంటూ ఆరోపించారు.విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన వెలగపూడి… పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తానని బాండ్ పేపర్పై రాసి ఇస్తావా? అని ప్రశ్నించారు. గజం కూడా ఆక్రమించలేదని నిరూపణ అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. అయితే దీనికి విశాఖ తూర్పు ఇంచార్జ్ విజయనిర్మల… తాను వస్తానంటూ ప్రతి సవాల్ చేసారు. అంతేకాదు ఏకంగా సాయిబాబా ఫోటోతో వెళ్లి మరింత ఉద్రిక్తత పెంచారు. కానీ తాను రమ్మన్నది విజయసాయిరెడ్డినని… అతను వస్తే ప్రమాణం చేస్తానని శాసన సభ్యుడు వెలగపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే… తాను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.
వైసిపి ఎమ్మెల్యే రాక ..వెలగపూడి గైర్హాజరు
కాగా వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ కార్యకర్తలతో ఆదివారం ర్యాలీగా సాయిబాబా ఆలయం వద్దకు వచ్చారు. అంతకుముందు ఆయన భారీ ర్యాలీగా వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా ఆలయం వద్దకు చేరుకున్నారు అమర్నాథ్. మొదట సవాల్ చేసింది టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణేనని, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే సవాలును స్వీకరించి సాయిబాబా గుడి వద్దకు రావాలని లేదంటే రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు. ఆలయంలో వెలగపూడి కోసం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎదురుచూశారు. అప్పటికి వెలగపుడి రాకపోవడంతో.. సవాల్ చేసినట్టు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలన్నారు గుడివాడ అమర్నాథ్ రెడ్డి.కాగా ఆరోపణలు చేసుకోవటం వాటికి సంబంధించి ఆలయాల్లో ప్రమాణాలకు సవాల్ విసురుకోవటం అనేది ఇప్పుడు కొత్తగా ఏపీలో మొదలైన ట్రెండ్!