NREGS Pending Bills: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. గడచిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగిన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించలేదు. నెలలు గడుస్తున్నా పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పలువురు కాంట్రాక్టర్ లు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ విచారణ జరుపుతున్న కారణంగా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయడం లేదు. దాదాపు 1500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొన్నాయి.
పలువురు కాంట్రాక్టర్ లు దాఖలు చేసిన పిటిషన్ల పై హైకోర్టు విచారణ జరుపుతుండగా కోర్టు అనే గౌరవం అనేది కూడా లేకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా, లేక రాష్ట్ర ప్రభుత్వమా అనేది తేలాల్సి ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు చెల్లించామనీ, మరో 1100 కోట్ల రూపాయలను మరో వారం రోజుల్లో చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసినట్లు కోర్టు విచారణకు హజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది. ఎస్ఎస్ రావత్ తెలిపారు నగదు నేరుగా కాంట్రాక్టర్ లకు చెల్లించకుండా పంచాయతీ అకౌంట్ లలో వేసి వేధిస్తున్నారని పిటిషన్ ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పెండింగ్ బకాయిలను గుత్తేదారులకు చెల్లించి వివరాలను హైకోర్టుకు నివేదించాలని ఆదేశించారు.
కేంద్రం నుండి ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయగా, తాము మొత్తం చెల్లించామని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు భిన్నంగా ఉండటంతో పూర్తి వివరాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల చెల్లింపు విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమా..? లేక రాష్ట్ర ప్రభుత్వమా? అనేది తదుపరి విచారణలలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.