Pawan Kalyan: పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడవద్దని కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామన్నారు.
జనసేనలోని కొందరు నేతలు ఇటీవల కాలంలో పొత్తులపై భిన్నాభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్ కు కీలక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయవద్దని కోరారు.
జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన ప్రధమ ప్రాధన్యం ఇస్తుందన్నారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని సూచించారు.
ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం విఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయని అన్నారు. అలానే పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చామని పవన్ తెలిపారు.
పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ కోరారు. పొత్తులపై కార్యకర్తలు సంయనం పాటించాలని, భావోద్వేగాలకు పోయి వివాదాస్పదంగా మాట్లాడవద్దని పవన్ సూచించారు.
Amit Shah: ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు .. చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లేనా..?