Peddireddy Ramachandra Reddy: గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శుల అధికారాల్లో కొన్ని విఆర్ఓలకు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆ జివో లో లోపాలు ఉన్నట్లు తాము గుర్తించామని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ లోపాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సర్పంచ్ ల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్నామనీ, సదరు జివో లో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే కొందరు కోర్టుకు వెళ్లారని మంత్రి చెప్పారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని పునరుద్ఘాటించిన మంత్రి పెద్దిరెడ్డి వీటిని తగిన విధంగా బలోపేతం చేయాల్సి అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఎలాగూ కోర్టు ఆ జివోను రద్దు చేసింది కాబట్టి లోపాలను సరిదిద్దుకుని మళ్లీ కొత్త జీవోను జారీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతోనూ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
కొసమెరుపు .. ఇంతకు ముందు హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుబడితే ఆ తీర్పును ప్రభుత్వం పై కోర్టులో సవాల్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నా ఆ జివోలోని లోపాలను సవరించి మరోక జీవో విడుదల చేస్తామని చెప్పడం విశేషం. కాగా జివో 2 ను హైకోర్టు సస్పెండ్ చేయడం పట్ల పంచాయతీ రాజ్ ఉద్యోగులు, సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనతో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు సంబంధించి మరెలాంటి జి వో తీసుకువస్తుందోనన్న చర్చ జరుగుతోంది.