PM Modi Hyderabad Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (శనివారం) రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసిఆర్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసిఆర్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకనున్నారు. గత కొంత కాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కార్ పై కేసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కేసిఆర్.. నరేంద్ర మోడీ పర్యటనకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం షంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్ చెరువు వదద్ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యుల్ విడుదల అయ్యింది. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ప్రధాన మంత్రి పర్యటన షెడ్యుల్ ఇదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి 2.15 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు పటాన్ చెరువులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల సభావేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటల వరకూ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మోడీ. మొక్కల రక్షణ కోసం వాతావారణ మార్పు, పరిశోధనా కేంద్రాన్ని, ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణోత్సవాల లోగోను, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను పీఎం మోడీ విడుదల చేస్తారు.
సాయంత్రం 4.25 గంటలకు ఇక్రిశాట్ సభా వేదిక నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి సాయంత్రం 4.50 గంటలకు హైదరాబాద్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి మోడీ చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకూ రామానుజ సహస్రాబ్ది సమరోహం వేడుకల్లో పాల్గొంటారు. పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుండి రాత్రి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడికి స్వాగతం పలకడమే కాక తిరిగి రాత్రి ఢిల్లీకి వెళ్లే సమయంలోనూ ఆయనే వీడ్కోలు పలకనున్నారు.