Tirupathi bypoll : తిరుపతి ఉప ఎన్నిక Tirupathi bypoll మండే ఎండల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తవడంతో ఎన్నికల రణరంగం మొదలైపోయింది. పార్టీలు, నాయకులు హోరాహోరీ ప్రచారం మొదలెట్టేశారు. ఉపఎన్నిక ప్రచారం హడావిడి చూస్తూంటే రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడిని తలపిస్తోంది. విమర్శలు, కౌంటర్లు నుంచి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లిపోయాయి పరిస్థితులు. నిన్న విజయసాయి రెడ్డి, సోము వీర్రాజు ట్వీట్ వారే ఇందుకు నిదర్శనం. ఈరోజు ప్రచార హోరు మొదలైన వెంటనే వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఇందుకు ఓ ప్రచార గీతం కూడా కారణమైంది.
ఎన్నికల్లో వైసీపీ కోసం ఓ ట్యూన్ కట్టించి జగన్ పై పాట పాడిస్తే.. దానిని బీజేపీ కాపీ కొట్టిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథాకాలతో జగనన్న పథకాలు అని పేరు పెట్టుకుని మీరే కాపీలు కొట్టారని కౌంటర్లు ఇచ్చారు. టీడీపీ-సీపీఐ పొత్తుపై కూడా గట్టి కౌంటర్లే పడ్డాయి బీజేపీ నుంచి. నిన్నటి టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు.. అంతిమ వేడుకల్లా అనిపించాయని, అంతిమ దశలో ఉన్న పార్టీ వెళ్లి నారాయణ చెవిలో నారాయణ.. నారాయణ అంటున్నారని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. రెండు వయసు మళ్లిన పార్టీలు ఒకరికొకరు కలిసి ఓదార్చుకోవడం తప్ప ఏం లేదని అన్నారు జీవీఎల్. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అని కూడా అన్నారు.
రత్నప్రభ ఓడిపోతారని తెలిసినా ఇక్కడ అభ్యర్ధిగా నిలబెట్టి మోసం చేస్తున్నారని వైసీపీ అంటోంది. గతంలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఆనాడు చంద్రబాబు ఒప్పుకున్నారని రత్నప్రభ అంటే.. చంద్రబాబు ప్రత్యేకంగా ప్యాకేజీ తీసుకున్నారేమో అని వైవీ సుబ్బారెడ్డి కౌంటరిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక హిందువులకు, హిందూ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. గతంలో చంద్రబాబును తిట్టిన టీడీపీ ప్రస్తుత అభ్యర్ధి పనబాక మాటలను ట్వీట్ చేశారు సోము వీర్రాజు. ఇలా.. నామినేషన్లు ముగిసిన మరుసటి రోజే తిరుపతిలో రాజకీయ పార్టీల తిట్ల పర్వం మొదలైపోయింది.