రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి కోవింద్ దంపతులు రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా ఇన్ చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అదే విధంగా బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తదితర నేతలు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి, గవర్నర్ కలిసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి చేరుకోగా ఆలయంలోకి మేళతాళాలు, వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జెఈఓ బసంత్ కుమార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలుగా ఆలయంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశాన్ని నిలిపివేసింది. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ దంపతులు మధ్యాహ్నం 1.05 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా వరాహస్వామివారి వారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల నుండి బయలు దేరి విమానాశ్రయం చేరుకుని 4.50గంటలకు చెన్నైకు తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్షరెన్స్ ఉండటంతో సీఎం జగన్మోహనరెడ్డి గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అయ్యారు.