Fuel Price Rise: పెట్రోల్ ,డీజిల్ ధరలు శరవేగంతో పరుగులు తీస్తున్నాయి.అనేక రాష్ట్రాల్లో వీటి ధరలు సెంచరీ మార్కును దాటేశాయి. భారతదేశ చరిత్రలో ఇది ఆల్టైమ్ రికార్డని చమురు రంగ నిపుణులు చెప్తున్నారు.మే నాలుగున ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇప్పటివరకు పెట్రో ఉత్పత్తుల ధరలు ఇరవై అయిదు సార్లు పెరిగాయి.ఈ నలభై నాలుగు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ కి 6.26 పైసలు,డీజిల్ ధర లీటర్ కి 6.68 పైసల చొప్పున పెరిగాయి.
Fuel Price Rise: ఢిల్లీలో తక్కువ ..రాజస్థాన్ లోఎక్కువ!
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 96.66 రూపాయలుగా ఉంది.అలాగే డీజిల్ ధర 87.41రూపాయలు పలుకుతోంది.హస్తిన లో పెట్రో ఉత్పత్తుల ధరలు సెంచరీ దాటకపోయినా అనేక రాష్ట్రాల్లో లీటర్ ధర వంద రూపాయల కంటే అధికమైపోయింది.రాజస్థాన్లోని గంగానగర్లో గురువారం అత్యధిక పెట్రోల్ ధర నమోదైంది.అక్కడ లీటర్ పెట్రోల్ ధర 107.79 రూపాయలకు చేరుకుంది.లీటర్ డీజిల్ ధర 100.51 రూపాయలు అయింది.దేశం మొత్తం మీద ఇదే అత్యధిక రేటు అని చమురు రంగ నిపుణులు చెప్పారు.
మెట్రో నగరాల్లో ఎలా ఉందంటే?
ఇక దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు ముంబై ,బెంగుళూరులలో ఎక్కువగా ఉన్నాయి. ముంబైలో 102 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఉండగా బెంగుళూరులో 99.89 రూపాయలు పలుకుతోంది.మిగిలిన మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్ ధర కాస్త అటు ఇటుగా ఇంతే ఉంది.
బాగా ప్రభావితమైన రాష్ర్టాలు!
పెట్రో ఉత్పత్తులు ధరలు పెరగడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, కర్నాటక తెలంగాణ ,లడక్ రాష్ర్టాలు బాగా ప్రభావితమయ్యాయి.ముంబయి, రత్నగిరి, పర్భానీ, ఔరంగాబాద్ ,జైసల్మీర్, గంగానగర్, బన్స్వారా, ఇండోర్ ,భోపాల్ ,గ్వాలియర్, గుంటూరు కాకినాడ చిక్మగలూరు,శివమొగ్గ హైద్రాబాద్, లే పట్టణాల్లో లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలు దాటేసింది.అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం ,ఆయా రాష్ర్టాల్లో ఉన్న అంతర్గత పన్నుల విధానం వల్ల పెట్రోల్ ,డీజిల్ ధరలు ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఆకాశానికి అంటుతున్నట్లు చమురు రంగ నిపుణులు చెబుతున్నారు.ఢిల్లీలో పెట్రోల్ ధర తక్కువగా ఉండటం కొన్ని రాష్ర్టాల్లో ఈ రేటు ఎక్కువగా ఉండటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.స్థానిక పన్నుల విధానాన్ని సవరిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు.మరి రాష్ర్టాలు ఆ పనిచేస్తాయా అంటే అనుమానాస్పదమే!