హైదరాబాద్, మార్చి 7 : సేవామిత్ర యాప్లో తెలంగాణకు సంబందించిన డేటా కూడా దొరికిందని ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారనే విషయం తెలుసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఐటి గ్రిడ్స్పై వస్తున్న డేటా చోరీ ఆరోపణలపై నేటి నుంచి దర్యాప్తు మొదలు పెడుతున్నట్లు గురువారం రవీంద్ర హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు.
’డేటా వ్యవహారంపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దర్యాప్తు జరుగుతుంది. కేసు దర్యాప్తుకు తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఫిర్యాదుపై ప్రతి అంశాన్ని కూలంకుషంగా దర్యాప్తు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం వాడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. డేటా వ్యవహారంపై ఐటి గ్రిడ్స్ , బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయా అని పరిశీలిస్తాం. వీలైనంత త్వరగా కేసును విచారించి నివేదిక కోర్టు ముందుచుతాం. కేసు విచారణ నిస్పక్షపాతంగా జరుగుతుంది. దర్యాప్తులో పురోగతి మేరకు వివరాలు వెల్లడిస్తాం’ అని రవీంద్ర అన్నారు.
‘ఐటి గ్రిడ్స్ సేవామిత్ర యాప్ తయారు చేసింది. ఐటి గ్రిడ్స్ వద్ద ఓటర్ కార్డు ,ఆధార్, లబ్ధిదారుల సమాచారం ఉంది. ఐటి గ్రిడ్స్ వద్ద సమాచారం దుర్వినియోగం అవుతోందన్న ఫిర్యాదుపై విచారణ జరుగుతుంది. ఫిర్యాదు మేరకు సంస్థలో సోదాలు చేపట్టి డేటా సీజ్ చేశారు. డేటా ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకోసం వాడుతున్నారు అనేదానిపై ధర్యాప్తు చేస్తాం. ఏపీకి చెందిన వివరాలు దుర్వినియోగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎవరైనా దోషులనే నిర్ధారణకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డేటా కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు లేఖలు రాశాం. ఫోరెన్సిక్ వివరాలు వచ్చాక దర్యాప్తు మరింత వేగవంతమవుతుంది’ అని రవీంద్ర అన్నారు.
‘ఐటి గ్రిడ్స్ ఎండి అశోక్ను త్వరలో పట్టుకుంటాం. అశోక్ అమరావతిలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా తీసుకొస్తాం. అశోక్ దోషి అని తేలితే కోర్టు ముందుంచుతాం. సేవామిత్ర ఫీచర్లు ఎందుకు తొలగించారనే విషయమై అశోక్ను విచారిస్తాం’ అని రవీంద్ర అన్నారు.