YS Jagan: దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అమలు చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని మించి ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రథంపై నడిపిస్తున్నారు. అనేక పథకాలు దేశానికి సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి,. వేల కోట్ల రూపాయలను పేదలకు పంచి పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో వైపు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను కూడా తీసుకువచ్చి దేశంలో క్షేత్ర స్థాయి పరిపాలన అంటే ఇలా ఉండాలి అని ఒక రకంగా జగన్ నిరూపించే ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే జగన్ పరిపాలనలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవస్థలో మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు జగన్ ను అంత ఎత్తున నిలబెడుతున్నాయి. ఇదంతా ఒకెత్తు…అయితే కొన్ని వర్గాల్లో మాత్రం జగన్ పరిపాలనపై వ్యతిరేకత రావడం కాస్త వైసీపీ వర్గాలను కలవరపెడుతున్న అంశమే. అయితే ఇది ఏమీ మించిపోలేదు. రానున్న రెండు మూడేళ్లలో దీన్ని పూడ్చుకునే అవకాశం కూడా ఆ అధినేత జగన్మోహనరెడ్డికి ఉంది.
YS Jagan: రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా ఉద్యోగుల జీతాల చెల్లింపులు
ఆర్ధిక పరిస్థితిని బేరీజు వేసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్రం రుణాంద్రప్రదేశ్ గా మారిపోయింది. ప్రతి నెలా ఒకటవ తేదీ వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా తయారైంది. ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ లు ఇవ్వడానికి దాదాపు రూ.5వేల నుండి రూ.6 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ భరోసా పెన్షన్ లు ఇవ్వాలి. వీటితో ఒకటవ తేదీన అదనపు ఖర్చులు ఉంటాయి. వీటికి గానూ ప్రభుత్వ ఖజానాలో సుమారు రూ. నుండి రూ.6వేల కోట్లు ఉండాలి. కానీ ఇప్పుడు చూసుకంటే వెయ్యి నుండి రూ.1500 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి. ఇది ప్రతి నెలా ఉండే సమస్య. రానురాను ఈ సమస్య ఇంకా తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కనబడటం లేదు. అదాయాన్ని పెంచుకునేందుకు బస్సు చార్జీలు పెంచడమో, విద్యుత్ చార్జీలు పెంచడమో, ఇతరత్రా మద్యం తదితర ధరల పెంపు చేస్తున్నారు కానీ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, సంపద సృష్టి తదితర విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు 5 నుండి 6 లక్షల మంది వరకూ ఉన్నారు. 15 లక్షల మందికిపైగా రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు ఉండగా అందులో 30 శాతం మంది ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం అయిపోయారు.
ఒకటవ తేదీ వస్తుందంటే ప్రభుత్వానికి దడే..
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనూ ఏపిలో లాంటి పరిస్థితి తలెత్తలేదు. ప్రభుత్వ ఉద్యోగి అంటే వారికి టంఛన్ గా ఒకటవ తేదీ జీతాలు అందుతుంటాయి. కానీ ఏపిలో పూర్తి స్థాయిలో నెలలో ఒకటవ తేదీన జీతాలు చెల్లింపు జరిగే పరిస్థితి లేదు. వేలకు వేలకు జీతాలు తీసుకునే వారికి ఒక నెల జీతం ఆలస్యం అయితే ఏమవుతుందిలే అన్న అభిప్రాయం సామాన్యుల్లో ఉంటుంది. కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు వారికి ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. ఈఎంఐలు చెల్లించాల్సిన వారు ఉంటారు. జీతం ఆలస్యం అయితే ఆ వర్గాల వారు ఈఎంఐలు చెల్లింపులు జరగక చెక్ బౌన్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఉద్యోగ సంఘాల నేతలు వారి తరపున ప్రభుత్వంతో సమస్యలపై పోరాటం చేయాల్సి ఉండగా గతంలోనూ ఇప్పుడూ సంఘాల నేతలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే ఆ సంఘాల నేతలు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఆశించి సైలెంట్ గా ఉంటుంటారు. ఇది గతం నుండి వస్తున్నదే. తెలంగాణలో గతంలో ఉద్యోగ సంఘం నాయకుడైన శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ తరువాత టీఆర్ఎస్ లో చేరిపోయి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. అదే విధంగా ఏపిలో అశోక్ బాబు టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగ సంఘాల నేతలుగా కూడా పదవీ విరమణ తరువాత వైసీపీలో చేరిపోతారు. సమస్యలపై ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయకపోవడంతో ఉద్యోగుల్లో 30 నుండి 35 శాతం మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.