TDP : రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో మెరుగైందని ఆ పార్టీ వర్గాలు ఆనంద పడుతున్నాయి.నిజానికి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో జగన్ సునామీలో సైకిల్ కి పంక్చర్ అయింది.
సినీ నటుడు బాలకృష్ణ హిందూపురంలోను,సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండలో మాత్రం గెలవగలిగారు.అయితే పంచాయతీ ఎన్నికల నాటికి పరిస్థితులు బాగా మార్పు వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి .
TDP : బరిలోకి దిగడమే సాహసం!
అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దౌర్జన్యాలకు పాల్పడినా, యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చినా, వలంటీర్లతో ఓటర్లకు రాయబారం పంపినా టీడీపీ మద్దతుదారులు రెండో విడత పంచాయతీ ఎన్నికలను దీటుగా ఎదుర్కొన్నారు. సీట్లు తగ్గినా ఢీకొట్టడంలో ఎక్కడా వెనుకంజ వేయలేదన్న అభి ప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. తొలివిడత కంటే మెరుగైన ఫలితాలు ఆ పార్టీ మద్దతుదారులకు రావడం టీడీపీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మూడు, నాలుగో విడత ఎన్నికల్లో ఆ ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే ధీమా ఆ వర్గాల్లో కనిపిస్తోంది.
టిడిపి ఓటింగ్ శాతం బాగా పెరిగింది!
తొలి విడతలో 163 పంచాయతీలకు 24 సర్పంచ్ స్థానాలు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. ఓట్ల శాతానికి వచ్చేసరికి 20 శాతం ఓట్లు మాత్రమే తేడా కనిపిం చింది. దీన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి పట్టు పెరుగుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. రెండోవిడత లో ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లో 19 మండలాల్లోని 293 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ డివిజన్ల పరిధిలోకి ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయ దుర్గం, రాప్తాడు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో రాగా…. ఉరవకొండ నియోజకవర్గంలో బెళుగుప్ప మండలం ఉంది.
రెండో ఫేజ్ లో ఇంకా పుంజుకున్న టిడిపి!
రెండోవిడతలో వెల్లడైన ఎన్నికల ఫలితాలను నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, డీ. హీరేహాళ్, గుమ్మఘట్ట, కణేకల్లు, రాయదుర్గం మండలాల పరిధిలోని 85 పంచాయతీలకు వైసీపీ మద్దతుదారులకు 67, టీడీపీ మద్దతుదారులకు 16, వైసీపీ రెబల్స్కు 02 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ధర్మవ రం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, కనగాన పల్లి, రామగిరి మండలాల పరిధిలోని 119 పంచాయతీ లకు ఎన్నికలు జరగగా….
అందులో వైసీపీ మద్దతు దారులకు 94, టీడీపీ మద్దతుదారులకు 19, వైసీపీ రెబ ల్స్కు 5, ఇతరులకు ఒక సర్పంచ్ స్థానం దక్కింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు మండలాల పరిధిలోని 71 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ మద్ద తుదారులకు 54, టీడీపీ మద్దతుదారులకు 16, ఇతరులకు 01 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఉరవకొండ నియోజకవ ర్గంలోని బెళుగుప్ప మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ మద్దతుదారులకు 14, టీడీపీ మ ద్దతుదారులకు 4 సర్పంచ్ స్థానాలు దక్కాయి.
మొత్తంగా 293 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 229 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. 55 సర్పంచ్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. వైసీపీ రెబల్స్కు 7 దక్కాయి. ఇతరులు రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలో మూడు నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పై తెలుగుదేశం పార్టీ అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి