తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ముఖ్య నేతలు వివిధ పార్టీల్లో చేరడంతో పార్టీ ఉనికిని కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా ఏపిపైనే దృష్టి పెట్టి తెలంగాణను పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు ఉన్నా పార్టీ బలోపేతం కాలేదు. తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టిన చంద్రబాబు.. బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చెప్పారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఆదివారం నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన మేడ్చల్ పార్లమెంటరీ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాసాని పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న మల్కాజిగిరి లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని భయపడి బీఆర్ఎస్ నాయకులు తరచూ టీడీపీ ఎక్కడ ఉందని ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్య పెడుతున్నారని అన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే టీడీపీ నాయకులు అంతటా ఉన్నారని, వారిని మేల్కొలిపి ఓటు వేసేందుకు నడిపించాలని కార్యకర్తలను కోరారు కాసాని, తెలంగాణలో టీడీపీ లేదన్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం కావాలని ఆయన అన్నారు.
TSPSC Group 2 Exams: టీఎస్పీఎస్సీ గ్రూప్ – 2 పరీక్షల రీషెడ్యుల్ ఖరారు.. కొత్త తేదీలు ఇవే