హైదరాబాదు: స్టీల్ ట్రేడ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య తానే చేశానంటూ వాటర్ ప్లాంట్ యజమాని శ్యామ్ ముందుకు వచ్చారు. శ్యామ్ ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. ఈ హత్యతో కోగంటి సత్యంకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు రాంప్రసాద్ 15లక్షలు నష్టం వచ్చేలా చేశాడనీ, తనపై కేసులు పెట్టి వేధించాడనీ శ్యామ్ వివరించారు. అయన్ను హత్య చేస్తే తన డబ్బులు వస్తాయని రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ తనకు చెప్పినట్లు శ్యామ్ పేర్కొన్నాడు. 15 రోజులు రెక్కీ నిర్వహించి మరో ముగ్గురితో కలిసి ఈ హత్య చేసినట్లు ఆయన తెలిపారు. హత్య చేసిన తరువాత ఎల్బి నగర్ మీదుగా విజయవాడ పారిపోయినట్లు శ్యామ్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులను తన వాటర్ ప్లాంట్లోనే తయారు చేయించానని శ్యామ్ చెప్పారు. తన శిష్యులు ఛోటు, రమేష్లతో కలిసి ఈ హత్య చేసినట్లు శ్యామ్ పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోనున్నట్లు శ్యామ్ తెలిపారు.