తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారిలో అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన అంశం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పోలింగ్ పూర్తయింది. ఒక చోట రీపోలింగ్ కూడా జరిగింది.
ప్రస్తుతం ఫలితాల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే, అధికారిక ఫలితాల కంటే ముందే ఎప్పట్లాగే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అన్నింటా టీఆర్ఎస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. ప్రత్యర్థి పార్టీలు భారీ ఆశలు పెట్టుకున్న చోట టీఆర్ఎస్ తిరిగి మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం వెనుక కారణాలు కొన్ని ఉన్నాయి.
ఇవే అసలు కారణాలు…
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపిన అంశాలను రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ సమస్య, ట్రాఫిక్ , రోడ్ల సమస్య, పారిశుద్ధ్యం, వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపించాయి. దీంతోపాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవి కూడా టీఆర్ఎస్ గెలుపు ఓటముల్లో కీలక పాత్ర పోసించారు.
అదే ఇబ్బంది పెట్టింది కేసీఆర్ సార్…
హైదరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లపై అసంతృప్తి, వరద సాయంలో అవకతవకల వంటి అంశాలు టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయడం కూడా టీఆర్ఎస్కు కలసివచ్చింది. ఇక టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఆశించిన మేరకు హిందువుల ఓట్లను కొల్లగొట్ట లేకపోయింది.
నేడే విడుదల
కాగా, గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పుర్తి చేశారు అధికారులు. 30 సర్కిళ్లలో ఉదయం 8 గంటల నుంచి 150 వార్డుల ఓట్ల లెక్కింపు మొదలు అయింది. ఒక్కో హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఒక్కో రౌండ్ లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.ప్రతి కౌంటింగ్ హాల్లో ఓ రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ ప్రాసెస్ ను పర్యవేక్షించనున్నారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఓ అబ్జర్వర్ ను నియమించారు. పోటీలో ఉన్న క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్ ను నియమించుకోవచ్చు. క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ తరఫున ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్ ను మాత్రమే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతిస్తారు. హాల్లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా లేదా వీడియోగ్రఫీతో రికార్డు చేయనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు రిలీఫ్ ఏజెంట్ ను ఇవ్వబోమని, కౌంటింగ్ హాళ్లలోకి సెల్ ఫోన్లను అనుమతించబోమన్నారు అధికారులు.