Dasari: దాసరి Dasari: తెలుగు సినిమా దర్శకత్వానికి కొత్త అర్ధం చెప్పి.. దర్శకులకు దిక్సూచిగా నిలిచిన దిగ్దర్శకులు దాసరి నారాయణరావు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులద్దారు. స్టార్ హీరోల స్టేటస్ ను కొత్త హైట్స్ కు తీసుకెళ్లారు. తెలుగులో తొలిసారి 100 సినిమాల దర్శకుడిగా ఖ్యాతి గడించారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతోపాటు నటనలో కూడా దాసరి బహుముఖ ప్రజ. తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన దాసరి 74వ జయంతి నేడు. తెలుగు సినిమా మరచిపోలేని ఈ దిగ్దర్శకుడికి ఎన్నో అవార్డులు వచ్చినా ప్రభుత్వా పురస్కారాలు మాత్రం దక్కలేదు. దీనిపై తన గళం వినిపించారు మెగాస్టార్ చిరంజీవి.
దాసరి జయంతి సందర్భంగా.. ‘దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒకదానికి మించిన మరో చిత్రాలను తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యలని పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే! శ్రీ దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవటం ఒక తీరని లోటు. ఆయనకి పోస్త్యుమస్ గా నైనా విశిష్టమైని పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. చిరంజీవి వెలిబుచ్చిన అభిప్రాయంలో కూడా నిజం ఉంది.
దేశంలోనే ప్రముఖమైన ఒక ఇండస్ట్రీ నుంచి ఇంత ఖ్యాతి, రికార్డులను సాధించిన వ్యక్తికి ప్రభుత్వ పురస్కారాలు దక్కడం ఎంతో సముచితం. దాసరి ఆయన సినీ ప్రస్థానంలో మూడు జాతీయ పురస్కారాలు, రఘుపతి వెంకయ్య అవార్డు, తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. మొత్తంగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంతటి ఘనత వహించిన మార్గదర్శకుడికి ప్రభుత్వ అవార్డులు వచ్చేలా తెలుగు రాష్ట్రాలు ఆలోచించడం సముచితమే. దాసరి జయంతి సందర్భంగా ఎందరో సినీ ప్రముఖలు ఆయనకు ట్వీట్ల రూపంలో తమ ప్రేమను, అభిమానాన్ని చూపించారు.