Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం వెనుక నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి వ్యూహం ,కష్టం ఎంతైనా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు బలమైన జిల్లా, ఉమ్మడి నల్లగొండ. ఇక్కడ కాంగ్రెస్ను లేకుండా చేస్తే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం కనుమరుగవుతుందనే వ్యూహంతో ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి జగదీష్రెడ్డి సుదీర్ఘ వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారు.
ఆ క్రమంలోనే నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్కుమార్రెడ్డిని, తాజాగా కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డిని ఓడించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను మొహరించి ఓ యుద్ధమే చేసింది. సాగర్లోనూ మంత్రి జగదీష్రెడ్డి చాపకింద నీరులా తన ప్రణాళికను పూర్తిచేశారు. జానారెడ్డికి కుడి, ఎడమ భుజాలుగా ఉన్న వ్యక్తులందరినీ మంత్రి తన మంత్రాంగంతో కారెక్కించారు. ఎంసీ కోటిరెడ్డి, యడవెల్లి విజయేందర్రెడ్డి, భాస్కరావు, రాంచందర్ నాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి వచ్చిన తరువాత వారందరినీ కాపాడుకునే ప్రయత్నం చేశారు.
Nagarjuna Sagar: ఆరు నెలలుగా అదే పనిలో మంత్రి!
నోముల మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆది నుంచి సాగర్లో టీఆర్ఎస్ బలహీనంగా ఉండటంతో మంత్రిగా సూర్యాపేటతో సమానంగా సాగర్ను చూసుకుంటూ ముందుకు కదిలారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబరు నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం ప్రారంభించారు. భగత్ ఇంట్లోనే నియోజకవర్గ సర్పంచులు, గ్రామ, మండల పార్టీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలను గుర్తించి నెల్లికల్లు లిఫ్ట్ను తెరపైకి తెచ్చారు. నాలుగు వేల ఎకరాల సామర్థ్యాన్ని 35వేల ఎకరాలకు పెంచి పెద్దవూర, తిరుమలగిరిలో గిరిజనుల దృష్టి కారు గుర్తు వైపు మళ్లించారు. ఏడాదిన్నరలో నెల్లికల్లు పూర్తి చేయకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరి గిరిజన ప్రాంత ఓటర్ల దృష్టిని టీఆర్ఎస్ వైపు మళ్లించారు. సాగర్ను మున్సిపాలిటీగా ప్రకటించడం, హాలియా మున్సిపాలిటీకి నిధులు, డిగ్రీ కళాశాల, సాగర్లో ప్రత్యేకంగా మరో డిగ్రీ కళాశాలకు చకచకా అనుమతులు తెప్పించారు
అసమ్మతి నిప్పును ఆర్పారు..రెడ్లను దువ్వారు!
సుదీర్ఘకాలంగా బాధ్యతల్లో ఉన్నా టికెట్ రాలేదన్న నిరుత్సాహంలో ఉన్న ఎంసీ కోటిరెడ్డి ఎటూ జారిపోకుండా నిలబెట్టుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ నోట ఎమ్మెల్సీ చేస్తా అని బహిరంగ సభలోనే ప్రకటన చేయించారు. టీఆర్ఎస్లో 42 మంది రెడ్డి సామాజిక వర్గ సర్పంచులు ఉన్నారు వారంతా ఆ పార్టీకి పనిచేయడం సందేహమే అన్న నిఘా వర్గాల సమాచారాన్ని సైతం అందిపుచ్చుకొని ఆ పొరపాటు జరగకుండా చూసుకున్నారు. మరోవైపు ఇన్ఛార్జులుగా ఉన్న పల్లా రాజేశ్వరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావులతో ప్రతిరోజూ సమావేశం కావడం పోల్ మేనేజ్మెంట్లో కీలక అంశాలు చర్చించడం, ఆ విషయాలను అధినేత కేసీఆర్తో పంచుకోవడం, అధికార పార్టీకి అందివచ్చే వనరులన్నింటిని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లారు. మొదటి మూడు రోజులకు ఒక మారు సర్వే ఆ నివేదిక ప్రకారం దృష్టి పెట్టడం చివరి మూడు రోజులు ప్లాష్ సర్వే ఏరోజుకు ఆరోజు నివేదికలు లోపాలు సరిదిద్దుకుంటూ 25వేల మెజారిటీ లక్ష్యంతో అవసరమైన పనులు పోలింగ్ చివరి గంట వరకు చేసుకుంటూ వెళ్లారు. సుదీర్ఘ రాజకీయ వ్యూహంతో కీలకమైన మూడో వికెట్ జానారెడ్డిని పడగొట్టారు.