కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృష్టితో చూడాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఎవరైనా వరకట్నం డిమాండ్ చేసినందుకో, మహిళను హింసించినందుకో అరెస్టు చేయడానికి పార్లమెంటు అమోదించినప్పుడు, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఎందుకు ఆమోదించదని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు ఎవరిపట్లనో, ఏ మంతం పట్లనో తీసుకువచ్చింది కాదని అన్నారు. బిల్లు విషయంలో విపక్షం ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇలా ఉండగా లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ చాలా ముఖ్యమైన బిల్లు అని పేర్కొంది. దీనిని అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అందుకే దీనిని స్టాండింగ్ కమిటీ కి పంపాల్పిందిగా కోరుతున్నట్లు చెప్పారు. టీఎమ్ సీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ కూడా ఇదే డిమాండ్ చేశారు.
ఇక ఈ బిల్లుపై ఎమ్ఐఎమ్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా బిల్లును తీసుకువచ్చిందని విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులకు ఈ బిల్లు భంగకరంగా ఉందన్నారు. ఇలా ఉండగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. బిల్లుపై చర్చకు సహకరించాలని మంత్రిపదేపదే కోరారు. ఈ బిల్లు మహిళల సమానత్వం కోసం ఉద్దేశించినదని చెప్పారు. అయితే బిల్లు విషయంలో ప్రభుత్వం విపక్షాలను విశ్వాసంలోనికి తీసుకోలేదని విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.