గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కేంద్రంగా జరుగుతున్న ఎత్తుగడల్లో బీజేపీని టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తుండగా అదే రీతిలో కమలం పార్టీ సైతం గేమ్ ఆడుతోంది.
జాతీయ నేతలతో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంటే అదే అంశంలో టీఆర్ఎస్ పార్టీ కమలం నేతలను ఇరుకున పెట్టేలా చూస్తోంది. బీజేపీ నేతలను తాజాగా మంత్రి కేటీఆర్ టార్గెట్ చేసిన తీరు దీనికి నిదర్శనం.
నేతల క్యూ
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ జాతీయ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పార్లమెంట్, చేవెళ్లలో రోడ్ షోలో పాల్గొంటారు. 28న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొంటారు. 29న సికింద్రాబాద్లో రోడ్ షోలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. వీరితోపాటు సాద్వి నిరంజన్ జ్యోతి ప్రచారంలో పాల్గొంటారు.
ఢిల్లీ నేతలపై పంచ్లు
ఢిల్లీ నేతల టూర్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వరదలాగా ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాద్కు స్వాగతం అన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేదని చురకలు అంటించారు. ఉత్త చేతులతో రాకుండా వస్తూ వస్తూ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. లోకల్ పార్టీని ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీ నేతలు పోలోమంటు తరలుతున్నారని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.
తలసాని ఏం తక్కువ తినలేదు
కేంద్ర మంత్రులు టూరిస్టుల్లాగా వచ్చి తమషా చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేంద్ర మంత్రులకు హైదరాబాద్ లో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంతాల్లోని అభివృద్దిని వాళ్లు చూసుకోవాలని తలసాని అన్నారు. కాంగ్రెస్ వాళ్లను చూస్తుంటే గోసవుతుందని వాళ్ల మేనిఫెస్టోను చూస్తే నవ్వొస్తుందన్నారు. కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏమి తెలుసని…దమ్ముంటే రోహింగ్యాలను దేశం నుంచి బహిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 40 వేల మంది రోహింగ్యాలుంటే కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు